పెళ్లిరోజే ప్రతీకారం.. తొలి మహిళా ఆటో డ్రైవర్ హత్య కేసులో సంచలన నిజాలు!

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీలో సంచలనం సృష్టించిన తొలి మహిళా ఆటో డ్రైవర్ అనితా చౌదరి హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రేమ, ద్రోహం, ప్రతీకారమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల ద‌ర్యాప్తులో ప్రధాన నిందితుడు పట్టుబడటంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నెల‌ 4వ తేదీ రాత్రి ఝాన్సీలోని నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సకున్వా ధుక్వాన్ కాలనీ వద్ద అనితా చౌదరిని దుండగులు కాల్చి చంపారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహం, పక్కనే బోల్తా పడి ఉన్న ఆటోను పోలీసులు గుర్తించారు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు ముఖేశ్‌ ఝా, శివం, మనోజ్‌లపై కేసు నమోదు చేశారు. పోలీసులు వెంటనే శివం, మనోజ్‌లను అదుపులోకి తీసుకున్నప్పటికీ, ప్రధాన నిందితుడైన ముఖేశ్‌ ఝా పరారయ్యాడు.

పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ముఖేశ్‌ తన కారును బెత్వా నదిపై ఉన్న నోట్‌ఘాట్ వంతెన వద్ద వదిలిపెట్టి వెళ్లాడు. శుక్రవారం రాత్రి భగవంతపుర సమీపంలోని మట్టి రోడ్డులో ముఖేశ్‌ను పోలీసులు చుట్టుముట్టారు. అతను పోలీసులపై కాల్పులు జరపగా, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడి కాలికి బుల్లెట్ తగిలింది.

ఎస్పీ (సిటీ) ప్రీతి సింగ్ కథనం ప్రకారం.. ఆరేళ్ల క్రితం ముఖేశ్‌, అనిత ప్రేమించుకుని ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే, కొద్దికాలానికే అనిత అతడిని విడిచి వెళ్లిపోయింది. దీన్ని ద్రోహంగా భావించిన ముఖేశ్‌, ఆమెపై పగ పెంచుకున్నాడు. తమ పెళ్లి జరిగిన రోజునే (జనవరి 4న) ఆమెను హత్య చేసి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే ఆటో నడుపుతున్న ఆమెను కాల్చి చంపినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. అతని వద్ద నుంచి ఒక పిస్టల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Uttar Pradesh
Anitha Choudhary
Jhansi
auto driver murder
love affair
betrayal
revenge killing
crime news
Mukesh Jha

More Telugu News